ఢిల్లీలో ధర్నా చేస్తానన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు సెటైర్

by Satheesh |
ఢిల్లీలో ధర్నా చేస్తానన్న జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్త రషీద్ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ టీడీపీ పార్లమెంటరీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో జగన్ ఢిల్లీ ధర్నా అంశాన్ని బాబు ప్రస్తావించారు. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో మనకు అనవసరమని.. ఆయన ఏం చేస్తారనేది మనకు ముఖ్యం కాదని.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనమేం చేయాలనేది ఇంపార్టెంట్ అని ఎంపీలకు తేల్చి చెప్పారు. జగన్ ధర్నా ఇష్యూను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.

కాగా, జగన్ వ్యాఖ్యలను బాబు లైట్ తీసుకోవడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే, ఏపీ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా జరిగిన ఈ భేటీలో ఎంపీలకు చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించాలని.. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని రాబట్టాలని ఎంపీలను ఆదేశించారు. కేంద్రంతో కూడా మంత్రులు సంప్రదింపులు జరపాలని.. అవసరమైతే ఎంపీలు రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని కేంద్రమంత్రులను కలవాలని బాబు సూచించారు.

Advertisement

Next Story